23, జనవరి 2011, ఆదివారం

జాబిలి నేర్చిన వెన్నెల పాట = వేసవిలో వచ్చిన ‘వెన్నెల పాట’


















మనిషి జీవితంలో అరమరికలు లేని అందమైన దశ బాల్యం.
పాపపుణ్యాలూ, కష్టనష్టాలూ,
ప్రపంచం పోకడలూ ఏమీ తెలియని వయస్సది.
అమ్మ ఒడిలోనో, తాతయ్య బొజ్జ మీదనో పడుకుని,
లాలి పాటలూ, రామ కథలూ వింటూ,
అచ్చమైన మనస్సు ఫలకం మీద అందమైన దృశ్యాలను ఆవిష్కరించుకుంటూ,
చిన్నారులు చిదానంద మూర్తులై ఉంటారు. ఆ దశలో మనం నేర్పిందే వేదం.
అలా నేర్పడానికి పుట్టిందే బాల సాహిత్యం.
ఆదిలో పిల్లల పదాలన్నీ ఇళ్ళల్లో అమ్మలూ, బామ్మలూ,
అల్లిన బొమ్మల పదాల అల్లికలే!
ఆ తరువాత మహా మహా కవులు కూడా
ఏదో ఒక దశలో బాల సాహిత్యాన్ని సృష్టించారు.
ఆధునిక యుగ కర్త గురజాడ కూడా –
“ మిరప కాయ బజ్జి
మినప్పప్పు సొజ్జి” అంటూ పిల్లాడిలా పదాలు కట్టారు.
ఆ తరువాత కొందరైనా పిల్లల సాహిత్యం కోసం కృషి చేశారు.
రోజులు మారి పోయాయి. మమ్మీ, డాడీ సంస్కృతి మన సమాజాన్ని
ఆపాద మస్తకం ఆవహించింది. “చిట్టీ చిలకమ్మ! అమ్మ కొత్తిందా”
అని పాడుకొనే పిల్లలు ఏరీ!
వాళ్ళలా పాటలను నేర్చుకుని పలికినా ఊరుకునే పెద్దలూ లేరు.
మన పిల్లలు “ అ, ఆ, ఇ, ఈ ….. లతో అక్షరాభ్యాసం చేయడం లేదు.
ముద్దు పలుకులు నేర్చుకునేటప్పుడే ఇంగ్లీషు a b c d ” లు రుద్దుతున్నాం.
అ -అమ్మ ; ఆ – ఆవు అని దీర్ఘాలు తీయడం మన పిల్లలకు రాదు.
“ఎ ఫర్ ఆపిల్ అంటూ పిల్లకాయలు ఎగురుతూంటే మనం వాళ్ళ ముఖాల్లో డాక్టర్లనో,
ఇంజనీర్లనో చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. గోచీ పెట్టుకోవడం రాని దశలోనే
గొట్టాం పేంట్లు తొడిగి నర్సరీలకూ, L.K.G. లకూ తోలి,
వాళ్ళ నోళ్ళలో నానుతున్న rhymes విని మురిసిపోతున్నాం.
ఇట్టి దశలో ఒకావిడ అమాయకంగా పిల్లల కోసం గేయాలు రాశారు.
ఆమె పేరు పి.కుసుమ కుమారి. రాస్తే రాశారు గానీ,
“జాబిలి నేర్చిన వెన్నెల పాట” అంటూ పరమ కవితాత్మకమైన పేరు పెట్టి,
మరీ అందంగా పుస్తకం అచ్చు వేశారు.
పిల్లల కోసం రాసిన ఈ పుస్తకంలో పేజీ పేజీకి పిల్లలు గీసిన బొమ్మలను సూపర్ ఇంపోజ్ చేసి,
“ఇది పిల్లల పుస్తకం సుమా!” అని ముఖం మీద గుద్ది మరీ చెప్పారు.
బాల సాహిత్యానికి ఆదరణ లేని ఈ కాలంలో
ఈ అతి సాహసం చేసినందుకు రచయిత్రిని అభినందించాల్సిందే!
ఈ పుస్తకంలో మొత్తం 30 గేయాలున్నాయి. అన్నీ తేట తెలుగులో రాసినవే!

“ పట్టెడంచు పావడాలు – పాపాయికి
పట్టె మంచం పావు కోళ్ళు – తాతయ్యకు”
- అని మొదలై,
“పెద్ద వాళ్ళందరినీ పిల్లలుగ పుట్టించు దేవుడూ!”
అనే అమాయకమైన “ఒక్క కోరిక”తో పుస్తకం ముగుస్తుంది.
మధ్యలో ఎన్నో రంగులు, ఎన్నో వెలుగులు.
పుస్తకం ఒక హరివిల్లై కనిపిస్తుంది.
ఈ గేయ రచనలో రచయిత్రి ఒక విలక్షణమైన రీతిని అవలంబించారు.
ప్రాచీనమైన మన సంస్కృతీ సంప్రదాయాలనూ ,
పౌరాణిక గాథలనూ చెప్పడానికి ప్రతీకలను ఎంచుకున్నారు.
“ విభూతి పండు – వెండి కొండలు
కస్తూరి బొట్టు – పాల సముద్రం
తామర పువ్వు – వేద పారాయణం –
తిరుగో తిరుగు, స్వామీ స్వామీ – ప్రదక్షిణం”
-ఇలా నాలుగైదు పాదాల్లో కేవలం ప్రతీకలతో త్రిమూర్తులను రూపు కట్టించారు.

అలాగే,
“ అష్ట దిగ్గజం – భువన విజయం
కృష్ణ రాయలు – ఆముక్త మాల్యద
సాల గ్రామం – నారాయణాయ నమోస్తుతే!
సైకత లింగం – నమ శ్శివాయ”
అంటూ ప్రతీకలతో ఆంధ్ర దేశం గురించి చెప్పడానికి ప్రయత్నించారు.
























రామాయణం గురించి కూడా కట్టె, కొట్టె, తెచ్చె”
అన్నట్లు మూడు ముక్కల్లో కొత్త ప్రతీకలతో చెప్పారు.
ఈ పద్ధతి అన్ని గేయాల్లోనూ రాణించింది. చమత్కారం, హాస్యం తదితరాలు ఉన్నా
మన గత సంస్కృతిని ఈ నాటి పిల్లలకు చెప్పాలనే తపనే
మొత్తం గేయాలన్నిటిలోనూ కనిపిస్తుంది.
రచయిత్రి చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పనిసరిగా అభినందించాలి.

రచయిత్రి రాసిన కొన్ని పాటలను చదివి, ఆనందించండి.


పిల్ల గాలి ఊసులన్ని
చిన్ని పూల బాసలన్ని
మనసు విప్పి చెబుతుంటే

ఇపుడే వస్తానమ్మా!
కొంచెం సేపు ఆగమ్మా! ||

వన్నె వన్నె ఈకలను
చిన్ని రాళ్ళు,గవ్వలనూ
పోగు చేసుకుని నేను
ఇపుడే వస్తానుండమ్మా! ||

గడ్డి పూల సొగసులన్ని
వెన్నెల కందిస్తాను
అలల నురుగు చిన్నెలను
ఇంద్ర ధనువులకు ఇపుడే
పరిచయాలు చేసొస్తా!
ఇపుడే వస్తాను !ఆగమ్మా! ||

అందమైన ప్రకృతికి
బాల సారె పేరు పెట్టి
ఆనందపుఋతువులకు
ఆ-ఆ -లను దిద్దించి
అమ్మా! నే వస్తాగా!
తొందర చేస్తావేమి !?! ||

బుల్లి బుల్లి పిట్టలకు
మాటలు నేర్పిస్తాను
చిరు జల్లుల వానలను
ఆటలు ఆడిస్తాను
అమ్మా!ఇపుడే వస్తా!
హడావుడి చేయొద్దు! ||


''''''''''''''''''''''''''''''''''''''


చిట్టి చిట్టి పాపాయికి
ఈక ఒకటి దొరికింది
చిట్టి తల్లి ఆ ఈకను
పట్టి ,పట్టి చూసింది

ఈకంటే ఈక కాదు
కన్నంటే "కన్ను" కాదు
అది , వేడుకైన నెమలి ఈక!
కడు వేడుకైన నెమలి కన్ను!

సిరి కన్నుల నింపేను
చిరు వన్నెలు చిందేను
వెన్నెలలో మెరిసేను !
వెన్నెలనే మురిపించును
ఇంతింతని చెప్ప లేము
ఔరౌరా! దీని సొగసు!!!

అలాంటిలాంటి ఈక ఐతే
అలనాడు క్రిష్ణయ్య
ఎలా దీన్ని మెచ్చేనట!?!

::::::::::::::::::::::::::::::::

ఓ జాబిల్లీ! దిగి రావోయి!

[అమావాస్య మఠము నుండి చంద మామా!]

చంద మామ! చంద మామ! చందమామా!
ఎందు దాగి ఉన్నావు చంద మామా! //

చిన్ని పాప మారాములు చేసెనోయీ!
అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!
కారు మబ్బున దాగున్న చంద మామా!
మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! //

ఆట బొమ్మలంటేను వెగటేసేను
నే- పాట పాడ "విననంటూ" హఠము చేసేను!
"అమా వాస్య మఠము నుండి "చంద మామా!
మా అమ్మాయి కొఱకు రావయ్యా! - హఠమును మాని! //

Labels: బాల కవితా గీతికలు


రాసిన వారు: యరమాటి శశి ప్రపూర్ణ
[ఈ వ్యాసం మొదట మే 24, 1992,
ఉదయం పత్రిక ఆదివారం అనుబంధం లో వచ్చింది.
- పుస్తకం.నెట్]

4 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

బాగున్నాయండీ! దొరుకుతోందా ఈ పుస్తకం బయట?

Anil చెప్పారు...

Superb. Chaalaa baagunnayi baala kavitwaalu.

Anil

kadambari చెప్పారు...

మందాకిని గారూ,
కాపీలు అన్నీ ఐపోయాయి.
మీ స్పందన నాకు చాలా ఆనందం కలిగించింది.
మళ్ళీ ప్రచురిస్తే, మీకు తప్పక పంపిస్తాను.
Thank you very much.

kadambari చెప్పారు...

Anil kumar,

Many many thanks for your compliments.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...